కార్యకర్తలు ఏకతాటిపైకి రావాల్సిన తరుణమిదే: Shashikala
ABN , First Publish Date - 2022-07-12T13:21:10+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత నాయకత్వం వహించిన పార్టీలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పార్టీలోని
ప్యారీస్(చెన్నై), జూలై 11: దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత నాయకత్వం వహించిన పార్టీలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పార్టీలోని కోటిన్నర మంది కార్యకర్తలు ఏకతాటిపైకి రావాల్సిన తరుణమిదేనని అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ పిలుపునిచ్చారు. పుదుకోట జిల్లాలో సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఎన్నికపై స్పందించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించుకొనేలా కొందరు చేస్తున్న కుయుక్తులు ఫలించవన్నారు. డబ్బు, అధికార బలంతో చేజిక్కించుకొనే ఎలాంటి పదవులూ న్యాయసమ్మతం కాదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రతి కార్యకర్త గమనిస్తున్నారని, అందరినీ ఏకతాటిపై నిలిపి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలోని కోటిన్నర మంది కార్యకర్తలు, ప్రజలు తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో ఆర్థిక నివేదికను కోశాధికారి మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధనలున్నాయని, ప్రస్తుతం జరిగిన సమావేశంలో ఇలాంటి నిబంధన పాటించలేదు కనుక ఆ సమావేశం చెల్లదని శశికళ అభిప్రాయం వ్యక్తం చేశారు.