మూడు లక్షలకు పైగా ఇళ్లలో అంధకారం.. ఇద్దరు విద్యుత్ అధికారుల సస్పెండ్!
ABN , First Publish Date - 2020-08-13T17:48:08+05:30 IST
ఉత్తరప్రదేశ్లో జన్మాష్టమి రోజున మూడు లక్షలకు పైగా ఇళ్లలో అంధకారం నెలకొంది. స్మార్ట్ మీటర్లోని అవాంతరాల కారణంగా విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా...
లక్నో: ఉత్తరప్రదేశ్లో జన్మాష్టమి రోజున మూడు లక్షలకు పైగా ఇళ్లలో అంధకారం నెలకొంది. స్మార్ట్ మీటర్లోని అవాంతరాల కారణంగా విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది రాత్రి వేళ చీకటిలో గడపవలసి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన విద్యుత్శాఖ మంత్రి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి, వారిపై విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో, మీరట్, వారణాసి, గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్, బరేలీ, మధుర, అలీగఢ్లలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయింది. తప్పుడు సిగ్నల్ కారణంగా విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు గుర్తించారు. 12 గంటల పాటు అధికారులు శ్రమించిన తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. ఒక ఉద్యోగి స్మార్ట్ మీటర్ను తప్పుగా ఆపరేట్ చేయడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఈ తప్పిదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో ఈఈఎస్ఎల్ ఆదేశ్ సక్సేనా, ఎల్అండ్టీ ప్రాజెక్ట్ మేనేజర్ శశికాంత్ అగర్వాల్ను సస్పెండ్ చేశారు.