ప్రేమ పేరుతో బాలికను ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి...
ABN , First Publish Date - 2021-03-22T15:35:50+05:30 IST
మరో కేసును కూడా సైబరాబాద్ పోలీసులు విజయవంతంగా పరిష్కరించారు.;..
హైదరాబాద్ : రెండేళ్ల వయసులో చార్మినార్లో తప్పిపోయిన బాలిక తిరిగి 15 ఏళ్ల వయసులో సైబరాబాద్ పోలీసుల చొరవతో తలిదండ్రుల చెంతకు చేరింది. వివరాలు కర్నూలుకు చెందిన ముస్లిం కుటుంబం 2005లో హజ్యాత్రకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లో ఆగి, చార్మినార్ సందర్శనకు వెళ్లింది. అప్పుడే వారి రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ పరిసరాల్లో ఏడుస్తున్న బాలికను గుర్తించిన స్థానికులు చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించారు. చైల్డ్లైన్ అధికారులు ఆమెను బోడుప్పల్లోని హ్యాపీ హోమ్లో చేర్పించారు. కొన్నాళ్లకు అక్కడి నుంచి మియాపూర్లోని వివేకానంద హోమ్కు తరలించారు. మానవ అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు హోమ్లలోని బాలికల వివరాలు ఆరా తీయగా, 17ఏళ్ల బాలిక గురించి తెలిసింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా బాలిక కుటుంబ సభ్యులను కర్నూలు నుంచి రప్పించారు. ఆ బాలిక తమ బిడ్డేనని తల్లిదండ్రులు గుర్తించారు. 15 ఏళ్ల తర్వాత బిడ్డ ఆచూకీ తెలియడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. పోలీసులు వారికి డీఎన్ఏ పరీక్షలు చేయించారు. నివేదిక రాగానే బాలికను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్టు తెలిసింది.
ప్రేమ పేరుతో..
మరో కేసును కూడా సైబరాబాద్ పోలీసులు విజయవంతంగా పరిష్కరించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ బాలిక(14)ను ఆమె సొంత రాష్ట్రానికి చేర్చగలిగారు. బాలికది మేరఠ్ జిల్లా గంగానగర్. రాజస్థాన్లో కూలీగా పనిచేస్తున్న మైనర్(17) ఫేస్బుక్ ద్వారా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చాడు. గచ్చిబౌలి పరిధిలోని ఓ బస్తీలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బాలిక తల్లిదండ్రులు గంగానగర్లో మిస్సింగ్ కేసు పెట్టారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు హై దరాబాద్లో ఉన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. సమాచారం ఇవ్వడంతో సీపీ సజ్జనార్ మానవ అక్రమ రవాణా నిరోధక బృందాన్ని రంగంలోకి దింపారు. పోలీసులను ఏమార్చేందుకు ఆ బాలుడు మొత్తం 30 సిమ్కార్డులు ఉపయోగించాడని తెలిసింది. 5 రోజులు కష్టపడిన పోలీసులు వారి ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూపీ పోలీసులకు అప్పగించారు. అతడిపై రాజస్థాన్లో బైక్ చోరీతోపాటు పలు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. ఇలా సైబరాబాద్ పోలీసులు ఐదునెలల్లో 32 మందిని బాఽధితులను రక్షించారు. 76 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.