యూపీ ఎన్నికలు : మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్పీ మౌర్య వెనుకంజ
ABN , First Publish Date - 2022-03-10T19:52:14+05:30 IST
ఏడు దశల్లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు
లక్నో : ఏడు దశల్లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఫజిల్ నగర్ స్థానంలో ఆయన బీజేపీ అభ్యర్థి సురేంద్ర కుమార్ కుష్వాహా కన్నా సుమారు 11,000 ఓట్ల మేరకు వెనుకబడి ఉన్నట్లు తాజా సమాచారం.
ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టు ఉన్న మౌర్య జనవరిలోనే బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. కంచు కోట వంటి పడ్రౌనాను వదిలి ఈసారి ఫజిల్ నగర్ నుంచి పోటీ చేశారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నియోజకవర్గంలో సుమారు 15,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. యోగి కేబినెట్లోని మంత్రులు శ్రీకాంత్ శర్మ, చౌదరి లక్ష్మీ నారాయణ్ మధుర జిల్లాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీఎం యోగి తన ఐదేళ్ళ పదవీ కాలంలో దాదాపు 20సార్లు మధురలో పర్యటించారు. మధుర అభివృద్ధి కోసం బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ను ఏర్పాటు చేశారు.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆర్ఎల్డీ-ఎస్పీ కూటమి మీరట్లోని మూడు నియోజకవర్గాల్లోనూ పరాజయం దిశగా కదులుతోంది. ఈ పార్టీల అధినేతలు జయంత్, అఖిలేశ్ తమ కూటమిని మీరట్లోనే ప్రకటించారు.
సిరతులో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి పల్లవి పటేల్ కన్నా సుమారు 3,000 ఓట్ల మేరకు వెనుకంజలో ఉన్నారు. టమ్కుహి రాజ్ నియోజకవర్గంలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ వెనుకంజలో ఉన్నారు.
సువార్ నియోజకవర్గంలో ఎస్పీ నేత అబ్దుల్లా అజాం ఖాన్ దాదాపు 7,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.