పీవీ ఫొటో పట్ల అభ్యంతరం తెలిపాం: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-03-13T21:17:06+05:30 IST

పీవీ నరసింహారావు బతికున్నప్పుడు బూతు మాటలు మాట్లాడి.. ఇప్పుడు ఆయన బొమ్మ వాడకోవడాన్ని ఆక్షేపించాం...

పీవీ ఫొటో పట్ల అభ్యంతరం తెలిపాం: ఉత్తమ్

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని సీఎం కేసీఆర్ తిట్టారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ ఫొటో వాడుకోవడాన్ని ఆక్షేపించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ నాయకుడు పీవీ ఫొటో వాడుకోవడం పట్ల సీఈవోకు అభ్యంతరం తెలిపామని..  ఈ విషయంపై కాంగ్రెస్ పక్షాన సీఈవోను కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెడుతోందని మండిపడ్డారు. ఉద్యోగులకు 29 శాతం పీఆర్సీ అంటూ లీక్ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్‌ను ఓడిస్తే.. ఉద్యోగులకు అనుకూలమైన ఫిట్‌మెంట్ వస్తుందన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.


ఓటర్లను తరలించడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారని చెప్పారు. వాటిపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ దొంగ ఓట్లను ఏయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని.. దీనిని అడ్డుకోవాలన్నారు. పోస్టల్ ఓట్లను పోలీసులు సేకరించి టీఆర్ఎస్‌కు వేసేలా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. వాళ్లను అడ్డుకోవాలి... చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల కోట్ల యాడ్స్పై ఇన్‌కమ్‌ట్యాక్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరు ఈ డబ్బులు ఇస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more