సీఎం కేసీఆర్ను చూస్తే కాంగ్రెస్ నేతలకు దడ
ABN , First Publish Date - 2020-05-23T09:55:11+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే కాంగ్రెస్ నాయకులకు గుండెదడ అని నగర మేయర్ వైసునీల్రావు అన్నారు.
రాజకీయపబ్బం గడుపుకునేందుకే ఉత్తమ్, రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని కళ్లుండి చూడలేని కబోధులు
నగర మేయర్ వై సునీల్రావు
కరీంనగర్ టౌన్, మే 22: ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే కాంగ్రెస్ నాయకులకు గుండెదడ అని నగర మేయర్ వైసునీల్రావు అన్నారు. ఇక మాకు నూకలు చెల్లినట్లేనని భావిస్తున్న ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డితోపాటు ఇతర నాయకులు రాజకీయ పబ్బంగడుపుకునేందుకే సీఎంపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని వారి మాటలు చూస్తే సిగ్గనిపిస్తోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు సీఎం, మంత్రులపై ఆశ, ఇప్పుడేమో పీసీసీ అధ్యక్ష పదవిపై కాంక్ష తప్పితే కాంగ్రెస్ నాయకులకు ప్రజల సంక్షేమంపై ధ్యాసే లేదని విమర్శించారు.
జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఒకే కార్యక్రమానికి వచ్చి వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడడం, మరో వర్కింగ్ప్రెసిడెంట్ కనీసం వారితో కలిసిపాల్గొనక పోవడం గ్రూపురాజకీయాలు, పదవులపై వారికి ఉన్న ఆశను తెలుపుతోందని ఎద్దేశా చేశారు. ఆరేళ్ళలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని చేసిన వాఖ్యలు చూస్తే కళ్లులేని కబోధుల్లా వారు కనిపిస్తున్నారని అన్నారు. ఆరేళ్ళ క్రితం ఉన్న తెలంగాణ, ఇప్పుడున్న తెలంగాణ చూస్తే వారికి మతిభ్రమించి మాట్లాడుతున్నారనే విషయం తెలుస్తుందని విమర్శించారు. సీఎంపై అవాకులు, చవాకులు పేలితే ప్రజలు సహించరని, ఇతర నాయకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు