కరోనా మరణాలకు 50 లక్షలు ఇవ్వాలి: యూటీఎఫ్
ABN , First Publish Date - 2021-05-07T10:13:37+05:30 IST
‘‘కొవిడ్తో మరణించిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై పోతున్నాయి. వారిని ఆదుకునేవారు ఎవరూ కనపడడంలేదు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్తో మరణించిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై పోతున్నాయి. వారిని ఆదుకునేవారు ఎవరూ కనపడడంలేదు. కేంద్ర ప్రభుత్వం గత మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వర్తిస్తూ కొవిడ్ బారినపడి మరణించిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించాలి’’ అని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కేఎ్సఎస్ ప్రసాద్ గురువారం సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, ఆ వెనువెంటనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు కొవిడ్ బారిన పడ్డారన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సహాయం లభించక వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించారన్నారు. మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి 15 రోజుల్లోపు ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులను, ఉపాధ్యాయులను కాపాడుకోవడానికి మెరుగైన వైద్య సౌకర్యలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని డిమాండ్ చేశారు.