దయ చూపొద్దు.. దాడులు చేయండి: ఐఎస్
ABN , First Publish Date - 2020-04-03T08:51:47+05:30 IST
ప్రపంచమంతా కరోనాకు భయపడుతోంది! కానీ ఇస్లామిక్స్టేట్ (ఐఎస్), అల్కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు మాత్రం.. ఈ మహమ్మారిని ఒక అవకాశంగా చూస్తున్నాయి. ఆయా గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు...
న్యూయార్క్, ఏప్రిల్ 2: ప్రపంచమంతా కరోనాకు భయపడుతోంది! కానీ ఇస్లామిక్స్టేట్ (ఐఎస్), అల్కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు మాత్రం.. ఈ మహమ్మారిని ఒక అవకాశంగా చూస్తున్నాయి. ఆయా గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు.. ‘ఈ వైరస్ ముస్లిమేతరులకు శిక్ష’ అని సందేశాలు వెలువరిస్తున్నారు. క్వారంటైన్లో ఉన్న ముస్లిమేతరులంతా ఇస్లాం గురించి తెలుసుకోవడం ద్వారా ఈ సమయాన్ని వినియోగించుకోవాలని అల్కాయిదా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎవరిపైనా దయ చూపవద్దని.. దాడులు చేయాలని ఐఎస్ సంస్థ గత నెల రెండో వారంలో ప్రచురించిన అల్-నబా అనే న్యూస్లెటర్ ద్వారా తన శ్రేణులకు పిలుపునిచ్చింది. మార్చి మధ్యలో ఇస్లామిక్స్టేట్ గ్రూపు చాద్ సైన్యంపై భీకర దాడి చేసింది. నైజీరియా-నిగర్ సరిహద్దులకు సమీపంలో 92 మంది సైనికుల ప్రాణాలను బలిగొంది. ఈజిప్టులో ఐఎస్ దాడులు పెరిగినట్లు అక్కడి సైనికాధికారులు తెలిపారు.