తండ్రి అంత్యక్రియలకని బయల్దేరి.. దుబాయిలో చిక్కుకున్న భారతీయుడు!
ABN , First Publish Date - 2021-03-05T22:55:27+05:30 IST
తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయల్దేరిన ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి.. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దుబాయిలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం
దుబాయి: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయల్దేరిన ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి.. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దుబాయిలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం స్పందించి.. అతనికి సహాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తన తండ్రి మరణ వార్తను విని.. కేరళకు చెందిన భారత సంతతి వ్యక్తి హరి సుకుమారన్ ఉన్నపలంగా ఇండియాకు బయల్దేరారు. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడం అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరి సుకుమారన్ తన పరిస్థితిని ట్విట్టర్లో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు తన పాత పాస్పోర్ట్తో లింక్ అయి ఉందని.. ప్రస్తుతం దాన్ని అమెరికాలో మరచిపోయానని పేర్కొన్నారు. కొత్త పాస్పోర్టుకు ఓసీఐ కార్డు లింక్ చేసి లేనందును తన ప్రయాణాన్ని అధికారులు అడ్డుకున్నారని ట్విట్టర్లో వాపోయారు. ఈ ట్వీట్ దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి వెళ్లడంతో అధికారులు అతనికి సహాయం చేశారు. వీసాను మంజూరు చేసి, అతని ప్రయాణానికి మార్గం సుగమం చేశారు. ఈ క్రమంలో హరి సుకుమారన్.. కేరళలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు.