Dollar vs rupee: డాలర్‌ పరుగులు.. భారంగా మారుతున్న అమెరికా చదువులు.. విద్యార్థులపై లక్షల్లో అదనపు భారం

ABN , First Publish Date - 2022-09-24T12:57:17+05:30 IST

డాలర్‌ విలువ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Dollar vs rupee: డాలర్‌ పరుగులు.. భారంగా మారుతున్న అమెరికా చదువులు.. విద్యార్థులపై లక్షల్లో అదనపు భారం

అమెరికా చదువులపై డాలర్‌ భారం

రోజురోజుకూ పైపైకి డాలర్‌ విలువ

గతేడాది రూ.73.. ప్రస్తుతం రూ.81పైనే

రెండేళ్లలో విద్యార్థులపై 8లక్షల  భారం

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): డాలర్‌ విలువ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్న విద్యార్థులకు డాలర్‌ విలువ పెరగడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ఏడాది, రెండేళ్ల క్రితం ఉన్న డాలర్‌ విలువకు, ఇప్పటి విలువకు భారీగా వ్యత్యాసం ఉంది. ఫలితంగా విద్యార్థులపై లక్షల్లో అదనపు భారం పడుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్య కోసం భారత్‌ నుంచి ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. దేశం నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులు చేయడానికి ఏటా అమెరికాకు వెళ్తున్నారు. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య 15వేల వరకు ఉంటుందని అంచనా. సాధారణంగా విదేశీ విద్య కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు... కోర్సు పూర్తయ్యే వరకు చెల్లించాల్సిన ఫీజులతోపాటు వసతి, భోజనం ఖర్చులకు అవసరమైన నిధులను కూడా ముందుగానే సమకూర్చుకుని వెళుతుంటారు. అక్కడ చెల్లించే ఫీజులు కానీ, ఇతర ఖర్చులు కానీ.. విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పీజీ కోర్సు పూర్తయ్యేనాటికి (రెండేళ్లకు) ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకుంటారు. కానీ,  కోర్సుల్లో చేరిన తర్వాత డాలర్‌ విలువ పెరగడంతో మొదట్లో వేసుకున్న ఖర్చుల అంచనాలు తారుమారవుతున్నాయి. 


 అమెరికాలోని నేషనల్‌ యూనివర్సిటీల్లో పీజీ ఫీజులు ఏడాదికి 40వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా ఎక్కువగా, స్టేట్‌ యూనివర్సిటీల్లో కొంత తక్కువగా ఫీజులు ఉంటాయి. ఇవి కాకుండా వసతి, భోజనం, ఇతర ఖర్చుల కోసం నెలకు 1,000 నుంచి 1,200డాలర్ల వరకు ఖర్చవుతాయి. మొత్తంగా ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఏటా ఒక్కోవిద్యార్థికి సుమారు 50వేల డాలర్ల వరకు అవసరం ఉంటుంది. గతేడాది ఆగస్టు అడ్మిషన్‌ సెషన్‌ సమయంలో రూపాయితో పోల్చుకుంటే డాలర్‌ మారకం విలువ రూ.73గా ఉంది. అంటే... సుమారు రూ.36లక్షలు అవసరమవుతాయి. ఏడాది తిరిగేసరికి... అంటే ఈ ఏడాది అడ్మిషన్‌ సెషన్‌ సమయానికి డాలర్‌ విలువ రూ.80 దాటింది. దీని ప్రకారం చూస్తే... ఏడాదికి రూ.40లక్షల వరకు అవసరం ఉంటుంది. అంటే  రెండేళ్ల పీజీ కోర్సు పూర్తయ్యేనాటికి రూ.8లక్షలు అదనంగా ఖర్చవుతుంది. కాగా.. డాలర్‌ విలువ పెరుగుదల ప్రభావం విమాన చార్జీలపైనా ఉంటోంది. ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నా రూ.7-8వేలు అధికంగా చెల్లించాల్సి వస్తోంది.

Updated Date - 2022-09-24T12:57:17+05:30 IST