కరోనాతో ఇంకా జీవన్మరణ పోరులోనే ఉన్నాం: బైడెన్

ABN , First Publish Date - 2021-04-07T17:12:04+05:30 IST

మహమ్మారి కరోనాతో అగ్రరాజ్యం అమెరికా ఇంకా జీవన్మరణ పోరులోనే ఉందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

కరోనాతో ఇంకా జీవన్మరణ పోరులోనే ఉన్నాం: బైడెన్

వాషింగ్టన్: మహమ్మారి కరోనాతో అగ్రరాజ్యం అమెరికా ఇంకా జీవన్మరణ పోరులోనే ఉందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రజలకు తన అడ్మినిస్ట్రేషన్ కేవలం 75 రోజుల వ్యవధిలోనే 150 మిలియన్ల డోసులు అందించిన క్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ నెల 19 నుంచి అమెరికాలోని వయోజనులందరూ టీకా తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు. కనుక 18 ఏళ్లకు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా సాధ్యమైనంత ఎక్కువ మంది తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు తీసుకోవాలని ఈ సందర్భంగా అమెరికన్లకు బైడెన్ పిలుపునిచ్చారు. మంగళవారం వాషింగ్టన్‌లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి బైడెన్ మాట్లాడుతూ.. "మనం ముగింపు రేఖకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. మనకు ఇంకా చాలా పని ఉంది. కరోనాతో ఇంకా జీవన్మరణ పోరులోనే ఉన్నాం. అందరికీ టీకా​ అందేంత వరకూ ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. మనకు మంచిరోజులు ముందున్నాయి. జులై నాటికి మనం మన కుటుంబం, మిత్రులతో ఆనందంగా గడపబోతున్నాం. అయితే, ఇప్పటి నుంచి ఇంకా ఎన్ని మరణాలు, కష్టాలను చూడబోతున్నామనేవి మన ముందు ఉన్న ప్రశ్నలు" అని అన్నారు. ఇప్పటికే యూఎస్ వ్యాప్తంగా 5.56 లక్షల మంది అమెరికన్లు మహమ్మారికి బలయ్యారని బైడెన్ తెలిపారు. ప్రజలు కరోనా పట్ల నిర్ణక్ష్యం వహిస్తే మళ్లీ భారీ మూల్యం చెల్లింక తప్పదని హెచ్చరించారు.  

Updated Date - 2021-04-07T17:12:04+05:30 IST