లక్కీ లాటరీ: టీకా వేయించుకోండి.. మిలియన్ డాలర్లు గెలవండి!
ABN , First Publish Date - 2021-05-13T20:10:22+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 45 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకోగా, సుమారు 58 శాతం మంది ఒక్క డోసు పూర్తి చేసుకున్నారు.
ఓహియో: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 45 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకోగా, సుమారు 58 శాతం మంది ఒక్క డోసు పూర్తి చేసుకున్నారు. అయితే, ఈ టీకా ప్రక్రియను మరింత ఊతమిచ్చేందుకు అమెరికాలోని ఓహియో రాష్ట్రం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా గవర్నర్ మైక్ డివైన్.. లాటరీ పద్దతిని తీసుకువచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోంచి వారానికి ఒక విజేతను ఎంపిక చేసి, 1 మిలియన్ డాలర్లు(రూ.7.3కోట్లు) బహుమానంగా ఇవ్వనున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు. ఇది 18 ఏళ్లు నిండి, కనీసం ఒక్క డోసు టీకా పూర్తి చేసుకున్న వారికే వర్తిస్తుందని మైక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలా చేయడం డబ్బు వృథా అని కొందరు తన నిర్ణయాన్ని తప్పుబట్టే అవకాశం ఉంది. వారికి నా సమాధానం ఒక్కటే.. "కరోనా సమయంలో ప్రస్తుతం టీకా డోసులు అందుబాటులో ఉన్నా.. కొందరు నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోవడం ఇంత కన్నా వృథా" అని గవర్నర్ ట్వీట్ ద్వారా వివరించారు.
ఇక ఈ టీకా లాటరీలో తొలి విజేతను ఈ నెల 26న ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాతి వారం విజేతను తొలిసారి బహుమానం గెలుచుకున్న విజేత లాటరీ తీసి నిర్ణయిస్తారని గవర్నర్ చెప్పారు. అలాగే సోమవారం ఎఫ్డీఏ 12 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా టీకా తీసుకునే 17 ఏళ్లలోపు పిల్లల కోసం కూడా ఓహియో ఓ ప్రత్యేకమైన లాటరీని పెట్టింది. అయితే, ఈ లాటరీ గెలిచిన విజేతకు నగదు ఇవ్వరు. ఏడాది పాటు ఆ విజేతకు స్కూల్ స్కాలర్షిప్ చెల్లిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వారికి స్కాలర్షిప్ సదుపాయం కల్పించారు.