జియో మరో భారీ ఒప్పందం.. పెట్టుబడులకు ఇంటెల్ సై!
ABN , First Publish Date - 2020-07-03T15:41:48+05:30 IST
యోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికాకి చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఇంటెల్.. జియోలో...
న్యూఢిల్లీ: జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికాకి చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఇంటెల్ రూ.1894.50 కోట్లు పెట్టుబడులకు అంగీకరించినట్టు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. దీంతో ఆర్ఐఎల్ డిజిటల్ విభాగం జియో గడచిన 11 వారాల్లో వరుసగా 12వ భారీ పెట్టుబడి సాధించినట్టైంది. తాజా ఒప్పందంతో జియోలో ఇంటెల్ 0.39 శాతం వాటా దక్కించుకోనుంది. ఈ ఒప్పందం తాలూకు ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంది. ‘‘భారత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఇంటెల్తో కలిసి పనిచేసేందుకు సంతోషంగా ఉన్నాం..’’ అని ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.
కాగా తాజా ఒప్పందంతో కలిపి ఇప్పటి వరకు జియో రూ. 117,588.45 కోట్ల పెట్టుబడులు సాధించినట్టైంది. ప్రముఖ టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, టీపీజీ, ఎల్ కాటర్టన్, పీఐఎఫ్, ఇంటెల్ తదితర సంస్థలు పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయి.