అగ్రరాజ్యంలో ఆగని కరోనా ఉధృతి..!

ABN , First Publish Date - 2022-01-16T17:47:06+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

అగ్రరాజ్యంలో ఆగని కరోనా ఉధృతి..!

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కారణంగా రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వరల్డ్ఓమీటర్ (worldometers) డేటా ప్రకారం శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 24,25,894 మంది వైరస్​ బారిన పడగా.. 5,764 మందికి పైగా మృతి చెందారు. అయితే, ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క యూఎస్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. అమెరికాలో ఒమైక్రాన్​ శరవేగంగా వ్యాపిస్తుండటంతో రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.


ఆ దేశంలో నిన్న ఒకేరోజు 4,04,141 కొత్త కేసులు నమోదయ్యాయి. 886 మంది చనిపోయారు. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం కరోనా కేసులు 6,66,64,283కు చేరాయి. అలాగే ఇప్పటివరకు వైరస్‌కు బలైన వారి సంఖ్య 8,73,149కు చేరింది. ఇక రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బైడెన్​ ప్రభుత్వం ఆర్మీ వైద్య సిబ్బందిని సైతం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. యూఎస్‌తో పాటు ఫ్రాన్స్​, ఇటలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రిటన్​, టర్కీ తదితర దేశాల్లో కూడా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇటు భారత్‌లో కూడా కోవిడ్-19 కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.   

Updated Date - 2022-01-16T17:47:06+05:30 IST