America: వర్క్ పర్మిట్ల గడువు పొడిగింపు.. వేలాది మంది భారతీయులకు లబ్ధి
ABN , First Publish Date - 2022-05-05T13:10:09+05:30 IST
భారత్ నుంచి వచ్చేవారితో సహా వలసదారులకు భారీ ఊరటనిచ్చేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్, మే 4: భారత్ నుంచి వచ్చేవారితో సహా వలసదారులకు భారీ ఊరటనిచ్చేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారుల వర్క్ పర్మిట్ను 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రీన్కార్డులు ఆశించేవారితో పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) పొందిన హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో సహా నిర్దిష్ట వర్గాలకు గడువు ముగిసిన వర్క్ పర్మిట్లను పొడిగిస్తున్నట్లు బైడెన్ సర్కారు తాజాగా వెల్లడించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించిన ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఈఏడీల్లో పేర్కొన్న గడువు తేదీ నుంచి 180 రోజుల పొడిగింపు వ్యవధిని ఆటోమేటిక్గా 540 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 4.2 లక్షల మంది వలసదారులకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భుటోరియా తెలిపారు.