అది జరిగాకే భారత్ నుంచి వెళ్లిపోతా.. అమెరికా వైద్యుడి ప్రకటన! అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-21T03:25:32+05:30 IST

కొత్త సాగు చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఈ చట్టాలను పూర్తిస్థాయిలో వెనక్కు తీసుకుంటే కానీ తాను అమెరికాకు తిరిగి వెళ్లనని ఓ ప్రవాసీ వైద్యుడు తాజాగా తేల్చి చెప్పారు.

అది జరిగాకే భారత్ నుంచి వెళ్లిపోతా.. అమెరికా వైద్యుడి ప్రకటన! అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్:  కొత్త సాగు చట్టాల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఈ చట్టాలను పూర్తిస్థాయిలో వెనక్కు తీసుకుంటే కానీ తాను అమెరికాకు తిరిగి వెళ్లనని ఓ ప్రవాసీ వైద్యుడు తాజాగా తేల్చి చెప్పారు. ఆయనే.. డా. స్వైమాన్ సింగ్. న్యూజెర్సీ రాష్ట్రంలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల కోసం టిక్రీ ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. డా. సింగ్ గతేడాది డిసెంబర్ 7న భారత్‌కు వచ్చిన డా.సింగ.. నాటి నుంచి ఇక్కడే ఉంటూ రైతులకు వైద్య సేవలు అందిస్తున్నారు. 


‘‘సాగు చట్టాల ఉపసంహరణ పూర్తయ్యే వరకూ సంయుక్త కిసాన్ మోర్చా ఇక్కడే ఉంటుంది. నేను కూడా వారితోనే ఉంటాను. ప్రభుత్వం పార్లమెంటులో ఈ చట్టాలను ఉపసంహరించనీయండి. ఆ తరువాత అమెరికాకు తిరిగి వెళ్లేందుకు నేను ఏర్పాట్లు చేసుకుంటా. అక్కడి నుంచి పూర్తిగా వెళ్లిపోయేందుకు మాకు కనీసం 15 రోజులు పడుతుంది. అక్కడి వీధులను శుభ్రంగా చేశాకే వెళతాం. డిసెంబర్ నాటికి నా కుటుంబసభ్యుల్ని కలుస్తాననుకుంటున్నా’’ అని డా. సింగ్ అన్నారు. ‘‘కరోనా సంక్షోభం కారణంగా రైతులకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో వారికి సహాయం చేసేందుకు నేను ఇండియాకు వచ్చా. ఓ వైద్యుడిగా సమాజానికి సేవ చేయడం నా బాధ్యత’’ అని డా. సింగ్ పేర్కొన్నారు. 


ఏడాదిగా తన భార్యాపిల్లలను చూసుకోలేదన్న ఆయన.. కుటుంబం మద్దతు తనకెప్పుడూ ఉందని డా.సింగ్ పేర్కొన్నారు. ‘‘దేశం కోసం సేవ చేస్తున్న నన్ను చూసి వారందరూ గర్వంగా ఫీలవుతున్నారు’’ అని చెప్పారు. డా. సింగ్ స్వస్థలం పంజాబ్ లోని తరన్ జిల్లా. దాదాపు 25 ఏళ్ల క్రితం..సింగ్‌కు 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. డా. సింగ్ ప్రస్తుతం అమెరికాలో ఫైవ్ రివర్స్ హార్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తున్నారు. విద్యావైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తేవడమే ఈ సంస్థ లక్ష్యం. మరోవైపు.. డా.సింగ్ సారథ్యంలోని వైద్య బృందం ఇప్పటివరకూ దాదాపు లక్ష మంది రైతులకు వైద్య సేవలు అందించింది.

Updated Date - 2021-11-21T03:25:32+05:30 IST