అమెరికాలో రెండు లక్షలకు చేరువైన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-09-22T08:49:01+05:30 IST

అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. జాన్స్

అమెరికాలో రెండు లక్షలకు చేరువైన కరోనా మరణాలు

వాషింగ్టన్: అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,99,351 అమెరికన్లు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. మరోపక్క కరోనా సోకిన వారి సంఖ్య అమెరికాలో 68 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో నవంబర్ మూడో తేదీన అధ్యక్ష పదవి ఎన్నికలున్నాయి. ప్రస్తుతం అమెరికా రాజకీయాలు మొత్తం కరోనా చుట్టూనే తిరుగుతున్నాయి. ట్రంప్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం వల్లే అమెరికాలో ఈ పరిస్థితి ఏర్పడిందంటూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ట్రంప్‌పై నిత్యం విమర్శలు చేస్తున్నారు. 


మరోపక్క ట్రంప్ ఎన్నికల నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చి మరోమారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని ట్రంప్ అన్నారు. అయితే ఏడాది చివరి వరకు విజయవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌‌పై రాజకీయాలు చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కంటే జో బైడెన్ ముందంజలో ఉన్నారు. దీంతో ఏదో విధంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో కరోనా మరణాలు 50 వేల లోపే ఉంటాయని మొదట్లో ట్రంప్ అన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్యను 60,70,80.. ఇలా లక్షకు తీసుకెళ్లారు. ఇక మరణాల సంఖ్య లక్ష కూడా దాటేయడంతో ట్రంప్ మాటలను ప్రజలు నమ్మకపోగా.. కరోనాపై తగిన చర్యలు తీసుకోలేదనే భావన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.

Updated Date - 2020-09-22T08:49:01+05:30 IST