జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు యూఎస్ గ్రీన్‌సిగ్నల్!

ABN , First Publish Date - 2021-02-28T12:55:30+05:30 IST

ఒకే డోసుతో వ్యాక్సినేషన్‌ చేయదగిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించే దిశగా మరో అడుగు ముందుకు పడింది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు యూఎస్ గ్రీన్‌సిగ్నల్!

నిపుణుల బృందం పచ్చజెండా.. త్వరలో ఎఫ్‌డీఏ అనుమతులు?

ఉత్పత్తి హైదరాబాద్‌లోని ‘బయొలాజికల్‌-ఈ’లోనే

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 27: ఒకే డోసుతో వ్యాక్సినేషన్‌ చేయదగిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. సురక్షితం, ప్రభావవంతమైన ఆ టీకాకు అత్యవసర ఆమోదం పొందే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వైద్యనిపుణుల బృందమొకటి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కు సిఫారసు చేసింది. మొత్తం మీద టీకా 66 శాతం ప్రభావశీలతను కనబరుస్తోందని తెలిపింది. ప్రత్యేకించి తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన వారిపై ఇది 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని పేర్కొంది. ఎఫ్‌డీఏ సలహా బృందంలోని వైద్య నిపుణులంతా ఏకగ్రీవంగా చేసిన ఈ సిఫారసు ప్రాతిపదికన త్వరలోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు అనుమతులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.


అనుమతులు లభించగానే.. మార్చి 1 నుంచి డోసులను పంపిణీ చేసేందుకు ఆ కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటోంది. వివిధ దేశాల్లో ప్రబలుతున్న దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌పై ఈ వ్యాక్సిన్‌ 57 శాతం ప్రభావాన్ని చూపడం విశేషం. ఇక భారత్‌లో ఈ టీకాల ఉత్పత్తి ప్రక్రియను హైదరాబాద్‌లోని బయొలాజికల్‌-ఈ కంపెనీ చేపట్టనుందని జాన్సన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సార్థక్‌ రణడే వెల్లడించారు. దీనిపై రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. భారత్‌లో ఏటా 60 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-28T12:55:30+05:30 IST