యూరియా కొరత
ABN , First Publish Date - 2022-01-29T05:59:19+05:30 IST
కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో తక్కువ ధరకు లభించే యూరియా పైనే రైతులందరూ దృష్టి కేంద్రీకరించారు.
కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రైతులు
మిగతా ఎరువులతో పోలిస్తే ధర తక్కువ
కొంత మంది అవసరానికి మించి కొనుగోలు
యూరియా లభించక ఆందోళన
పెరవలి, జనవరి 28 : ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యి ఎరువులు వేసే సమయం ఆసన్నమవడంతో రైతులు ఎరువులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో తక్కువ ధరకు లభించే యూరియా పైనే రైతులందరూ దృష్టి కేంద్రీకరించారు. దీంతో యూరియాకు కొరత ఏర్పడింది. దానికి తోడు కొన్ని రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల్లో రైతులకు యూరియా విక్రయించిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆన్లైన్లో నిల్వలు ఉన్నట్లుగా చూపిస్తుందని, దీంతో జిల్లాకు యూరియా కేటాయింపులు అనుకున్న స్థాయిలో రాలేదని చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు రాబోయే రోజుల్లో దొరకదన్న అనుమానంతో ప్రస్తుతం అవసరం అయిన దాని కంటే ఎక్కువుగా యూరియా బస్తాలు కొని నిల్వ చేస్తున్నారు. దీంతో యూరియా నిల్వలు వెంటనే ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం యూరియా ధర 266 రూపాయలు మాత్రమే ఉండగా డీఏపీ 1200, మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు 1700 నుంచి 2 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఎక్కువ మంది రైతులు తక్కువ ధరకు లభించే యూరియానే కొనుగోలు చేస్తున్నారు.
అవసరం మేరకే కొనుగోలు చేయాలి
వ్యవసాయాధికారి ప్రదీప్కుమార్
మండలంలో సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల్లో 126 టన్నులు యూరియా సర్దుబాటు చేశాం. రైతులు అవసరం మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలి. అవసరం లేకపోయినా ఎక్కువ బస్తాలు కొనుగోలు చేసి మిగిలిన రైతులకు యూరియా అందని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు డీలర్లకు ప్రస్తుతానికి యూరియా సరఫరా ఇవ్వడం లేదు .