పోలీసు శాఖ ప్రతిష్ఠ పెరిగేలా నడుచుకోవాలి
ABN , First Publish Date - 2021-09-29T05:19:38+05:30 IST
ప్రజల్లో పోలీసు శాఖ ప్రతిష్ట మరింతగా పెరిగేలా నడుచుకోవాలని అర్బన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు.
నేర సమీక్షా సమావేశంలో అర్బన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
గుంటూరు, సెప్టెంబరు 28: ప్రజల్లో పోలీసు శాఖ ప్రతిష్ట మరింతగా పెరిగేలా నడుచుకోవాలని అర్బన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. స్టేషన పరిధిలో ప్రజలు పోలీసింగ్ పట్ల పూర్తి సంతృప్తి చెందేలా నిరంతరాయంగా 24 గంటలపాటు సేవలందిస్తూ ముందుకెళ్లాలన్నారు. స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న ఫోక్సో, చోరీ, దోపిడీ, ఇతర తీవ్రమైన కేసులపై సమీక్షించారు. ఆయా పెండింగ్ కేసుల్లో దర్యాప్తును సాంకేతిక సాక్ష్యాధారాలు సేకరించి త్వరితగతిన పూర్తి చేసి కోర్టులలో అభియోగ పత్రాలు పక్కాగా ఉండేలా దాఖలు చేయాలన్నారు. మహిళల భద్రత దృష్ట్యా ప్రతిరోజు దిశ, రక్షక్ వాహనాల్లో పెట్రోలింగ్ తిరుగుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువకావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీలు సుప్రజ, జెస్సీ ప్రశాంతి, సీతారామయ్య, రవికుమార్, రమణకుమార్, జి.శ్రీనివాసరావు, బి.చంద్రశేఖర్, ఎస్బీ సీఐలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్తోపాటు అర్బనలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఒకే స్టేషనలో ఐదారేళ్లుగా చేస్తున్న పోలీసుల బదిలీ
అర్బన జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బందిని బదిలీ చేయనున్నట్టు అర్బన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయా స్టేషన్లలో ఐదారేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలను త్వరలోనే బదిలీ చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి స్టేషన్ల వారీగా సిబ్బంది సంఖ్యపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో కార్టన సెర్చ్
అర్బనలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కార్టన సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అర్బన ఎస్పీ తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన పరిధిలోని మహానాడు కరకట్ట, మంగళగిరి పరిధిలోని పానకాలస్వామి గుడి సమీప ప్రాంతాలు, అలాగే వట్టిచెరుకూరు పరిధిలోని కోవెలమూడి, ముట్లూరు, నల్లపాడు పరిధిలోని స్వర్ణభారతినగర్ తదితర ప్రాంతాల్లో కార్టన సెర్చ్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ఆధ్వర్యంలో నల్లపాడు, వట్టిచెరుకూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఎంపిక చేసిన కాలనీలను ఆధీనంలోకి తీసుకుని ప్రతి ఇంటిని అణువణువూ గాలించనున్నట్టు అర్బన ఎస్పీ తెలిపారు.