నేటి ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదు
ABN , First Publish Date - 2020-12-03T05:27:08+05:30 IST
నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ ముస్లిం మైనార్టీ, ప్రజా సంఘాలు గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్పష్టంచేశారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
అర్బన్ ఎస్పీ ఆదేశాలు
గుంటూరు, డిసెంబరు 2: నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ ముస్లిం మైనార్టీ, ప్రజా సంఘాలు గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆందోళనలకు అవకాశమేలేదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన అర్బన్లోని పోలీస్ అధికారులు, సిబ్బందితో సెట్కాన్ఫరెన్స్ నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు పోలీసులకు అత్యవసరమైతే తప్ప సెలవులు మంజూరు చేయవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతిలేనిదే అసెంబ్లీ వైపు ఏ ఒక్కరినీ అనుమతించవద్దని సూచించారు. అసెంబ్లీ వైపు వెళ్ళే అన్నిరూట్లలో వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆందోళన కారులను అదుపులోకి తీసుకోవాలన్నారు. పోలీస్ హెచ్చరికలను బేఖాతరు చేసి ఎవరైనా అసెంబ్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.