పట్టణ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-18T05:35:14+05:30 IST
జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.
- అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
కరీంనగర్ టౌన్, మే 17: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా మున్సిపాలిటీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డుల వారీగా టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని శానిటేషన్, డ్రైనేజీ, లేబర్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలన్నారు. నీరు నిలిచే బహిరంగ ప్రదేశాలను గుర్తించి దోమలు తయారు కాకుండా ఆయిల్బాల్స్ వేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాల, కళాశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పిచ్చి మొక్కలు పెరిగిపోయి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలలో అప్డేట్ మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.