10 ఏళ్లు 6 ప్రయత్నాలు: వైరలవుతోన్న UPSC ఆశావహుడి ట్వీట్

ABN , First Publish Date - 2022-06-01T21:42:44+05:30 IST

సంబ్యాల్‌కు UPSCలో 942 మార్కులు వచ్చాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అలాగే UPSC కార్యాలయం వద్ద తాను తీసుకున్న ఫొటోను సైతం షేర్ చేశాడు. అయితే సంబ్యాల్‌కు నెటిజెన్లు మద్దతుగా నిలిస్తూ..

10 ఏళ్లు 6 ప్రయత్నాలు: వైరలవుతోన్న UPSC ఆశావహుడి ట్వీట్

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకైన ప్రభుత్వ ఉద్యోగంగా సివిల్ సర్వీసును చెప్పుకుంటారు. ఎంతో మంది ఎన్నో కలలతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. దేశవ్యాప్తంగా ఎంతగానో పోటీ ఉండే ఈ పరీక్షలో అర్హత సాధించేది కొంత మందే. అయినప్పటికీ పలుమార్లు ఈ పరీక్ష రాసేవాళ్లు వేలల్లో ఉంటారు. అలాంటి ఒక ఆశావహుడు చేసిన ట్వీట్ తాజాగా వైరల్‌ అవుతోంది. మే 30ప UPSC ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా దేశం దృష్టి అంతా ఈ ఫలితాలపై పడింది. ఈ నేపథ్యంలో తన 10 ఏళ్ల కష్టాన్ని ఆరుమార్ల పోటీని వివరిస్తూ రజత్ సంబ్యాల్ అనే UPSC ఆశావాహుడి స్పందన నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.


‘‘10 ఏళ్ల కఠోర శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. 6 సార్లు UPSC పరీక్షకు హాజరయ్యాను. 3 సార్లు ప్రిలిమ్స్‌లో పోయింది. 2 సార్లు మెయిన్స్‌లో పోయింది. ఇక చివరి సారి ఇంటర్వ్యూలో పోయింది. కేవలం 11 మార్కులతో ఈసారి కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇంతటితో ఆగిపోను. మరో ప్రయత్నం చేస్తూనే ఉంటా’’ అని రజత్ సంబ్యాల్ ట్వీట్ చేశాడు. 10 ఏళ్ల నుంచి తాను పడ్డ కష్టం బూడిద పాలైందంటూనే మరో ప్రయత్నానికి సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చాడు.


సంబ్యాల్‌కు UPSCలో 942 మార్కులు వచ్చాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అలాగే UPSC కార్యాలయం వద్ద తాను తీసుకున్న ఫొటోను సైతం షేర్ చేశాడు. అయితే సంబ్యాల్‌కు నెటిజెన్లు మద్దతుగా నిలిస్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు. అంతే కాకుండా అతడి శ్రమను, ఆశయాన్ని కీర్తిస్తున్నారు. వచ్చే పరీక్షలో సంబ్యాల్ తప్పకుండా ర్యాంక్ కొడతాడని, అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.



Updated Date - 2022-06-01T21:42:44+05:30 IST