పొంగుతున్న ఉప్పుటేరు

ABN , First Publish Date - 2022-09-13T05:59:24+05:30 IST

భారీ వర్షాలు కురుస్తుండటంతో మండలంలో విస్తరించి ఉన్న ఉప్పుటేరు పొంగుతోంది. దీంతో ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజ లు ఆందోళన చెందుతున్నారు.

పొంగుతున్న ఉప్పుటేరు
కలిదిండి మండలంలో పొంగిన ఉప్పుటేరు

తీర గ్రామాల ప్రజల్లో ఆందోళన

ఆక్వా రైతులు బెంబేలు  

రెగ్యులేటర్ల నిర్మాణానికి వినతి

కలిదిండి, సెప్టెంబరు 12: భారీ వర్షాలు కురుస్తుండటంతో మండలంలో విస్తరించి ఉన్న ఉప్పుటేరు పొంగుతోంది. దీంతో ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహించటంతో వల కట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఉప్పుటేరు తీర గ్రామాల్లో మత్స్యకారులు అధికంగా ఉన్నారు. చేపల వేటపై ఆధారపడి జీవించే వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. చినతాడినాడ, సున్నంపూడి, దుంపలకోడు దిబ్బ, కొండంగి, పల్లిపాలెం, మట్టగుంట, పెదలంక వరకు ఉప్పుటేరు సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సులోని వరదనీరు ఉప్పుటేరు లోకి రావటంతోపాటు సముద్రపు నీరు ఎగదన్నటంతో ఉప్పుటేరు పొంగు తోంది. దీంతో ఉప్పుటేరు వెంబడి ఉన్న చెరువులు గట్లు నీటమునిగే ప్రమాదం ఉండటంతో రైతులు గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. ఉప్పుటేరు వెంబడి సుమారు 20 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. చెరువు గట్లకు గండిపడితే భారీ నష్టం సంభవిస్తుందని రైతులు ఆందోళన చెందు తున్నారు. గతంలో భారీ వర్షాలకు కొల్లూరులో నీరు ఉప్పుటేరులోకి ప్రవహిం చటంతో ఉప్పుటేరు పొంగి ఉధృతంగా ప్రవహించటంతో తీర గ్రామాల్లో వలకట్లు కొట్టుకుపోవటంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే ఉప్పుటేరు తీర గ్రామాల్లో వరద ముంపుతోపాటు ఉప్పుటేరు వెంబడి ఉన్న చేపలు, రొయ్యల చెరువులు జలమయమయ్యే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఉప్పుటేరుపై త్వరితగతిన రెగ్యులేటర్లను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-13T05:59:24+05:30 IST