వృద్ధురాలిని ఆదుకోండి.. హెచ్ఆర్సీ ఆదేశం
ABN , First Publish Date - 2020-07-11T08:48:59+05:30 IST
‘‘అమ్మా.. నిన్ను చంపేస్తాం’’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనాన్ని మానవ హక్కుల కమిషన్ ..
‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణః
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘‘అమ్మా.. నిన్ను చంపేస్తాం’’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనాన్ని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో కన్నతల్లి వద్ద డబ్బు, నగలను కొడుకులు తీసుకుని బెదిరించిన ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధితురాలి కొడుకులు, కూతుళ్లను ఆగస్టు 7న తమ ఎదుట హాజరుపరచాలని యాదగిరిగుట్ట స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది. వృద్ధురాలిని తక్షణమే ఆదుకోవాలని, ఈ ఘటనపై సమగ్ర నివేదికను తమకు అందజేయాలని యాదాద్రి జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించింది.
చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన జెల్ల సంపూర్ణకు ఇద్దరు కొడుకులు. భర్త కిష్టయ్య మరణించడంతో ఆయన పేరుమీద ఉన్న పొలంపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. కుమారులు శ్రీనివాస్, జ్ఞానేశ్వర్లు ఆమె బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలు తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో యాదాద్రిలోని పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఆమె తలదాచుకుంటోంది.