‘ఉప్పల్’ ఎందుకు లేదంటే..
ABN , First Publish Date - 2021-03-01T09:52:38+05:30 IST
ఈసారి ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం) లేకపోవడం స్థానిక అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఈసారి ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం) లేకపోవడం స్థానిక అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. తెలంగాణలో పెద్దగా కరోనా కేసులు లేకపోయినా ఉప్పల్ స్టేడియాన్ని విస్మరించడంపై బోర్డు నుంచి స్పష్టత లేదు. కానీ దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో నెలకొన్న రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఇక్కడి ఆఫీస్ బేరర్లు ఎవరికి వారే అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడు అజరుద్దీన్పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సభ్యుల్లో ఐకమత్యం లేకపోవడం.. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణల వల్లే హైదరాబాద్ను బోర్డు పట్టించుకోలేదని సమాచారం. నగరాలపై బోర్డు అధికారులు అహ్మదాబాద్లో నిర్ణయం తీసుకున్న సమయంలో టెస్టు మ్యాచ్ను తిలకించేందుకు అజరుద్దీన్ కూడా అక్కడే ఉండడం గమనార్హం.