Hyderabad లో వారసులు లేని ఇంటిని కాజేసేందుకు యత్నం
ABN , First Publish Date - 2021-07-15T15:51:09+05:30 IST
ఉప్పల్లో వారసులు లేని ఇంటిని కొందరు బంధువులమంటూ కాజేసేందుకు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలనీవాసులు
హైదరాబాద్ సిటీ/ఉప్పల్ : ఉప్పల్లో వారసులు లేని ఇంటిని కొందరు బంధువులమంటూ కాజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆ కాలనీ వాసులు బ్రేకులు వేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ టీచర్స్ కాలనీ రాఘవేంద్రకాలనీలో 30 సంవత్సరాలుగా ఓ వృద్ధ్దురాలు, ఆమె కుమారుడు సొంత ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఆ తల్లి కొడుకులు చుట్టు పక్కన ఉన్న ఇండ్ల వారితో పెద్దగా మాట్లాడేవారు కాదు. దాదాపు 80 సంవత్సరాల వయస్సు ఉన్న రాజమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఆమె కుమారుడు నందకిషోర్ కూడా తల్లి చనిపోయిన 20 రోజులకే మృతిచెందాడు.
వారు మృతిచెందిన సమయంలో వారి బంధువులుగానీ, వారసులుగానీ ఎవరూ రాలేదని కాలనీవాసులు చెబుతున్నారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత కాలనీవాసులే ఇంటికి తాళం వేసి ఆ ఇంటిని పరిరక్షిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వారసులమని టీచర్స్ కాలనీలోని ఆ ఇంటికి వేసిన తాళం పగలగొట్టి మరో తాళం వేశారు. ఈ నెల 13న ఆ ఇంట్లో వస్తువులు సర్దుతుండగా కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంటికి తాళం వేయించారు. ఈ విషయమై ఉప్పల్ ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ చనిపోయిన ఇంటి యజమాని రాజమణి వారసులు ఎవరన్న విషయాన్ని తేల్చి వారికి చెందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు.