CDC: వచ్చే 4 వారాలు అగ్రరాజ్యానికి కష్టకాలమే!
ABN , First Publish Date - 2021-08-13T13:31:22+05:30 IST
రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. డెల్టా వేరియంట్ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది.
ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయి
12 వేల మంది మృతి: అమెరికా సీడీసీ
వాషింగ్టన్, ఆగస్టు 12: రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. డెల్టా వేరియంట్ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33,000కు పైగా కొవిడ్ రోగులు ఆస్ప్రతుల పాలవుతారని, సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య 3,300-12,600 ఉండొచ్చని వివరించింది. ఇప్పటికే అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో చేరికలు అధికంగా ఉన్నాయి. రోగులకు వైద్య సేవలు అందించడం క్లిష్టమవుతోంది.
బ్రిటన్కూ సెప్టెంబరు గండం
యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో సెప్టెంబరులో వైరస్ మళ్లీ విరుచుకుపడే ముప్పుందని వైద్య నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు వేసవి సెలవులు రావడంతో ప్రజలు విహార యాత్రలు, పర్యటనలు చేశారు. పాజిటివ్ వస్తే వేసవి సెలవులను ఆస్వాదించలేమన్న భయంతో లక్షణాలు న్నా టెస్టులు చేయించుకోవడం లేదు. దీంతో వైరస్ తిరగబెడుతోందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సగం జనాభాకే టీకా ఇచ్చి అన్ని కార్యక్రమాలకు అనుమతివ్వడం ఏమిటని కేంబ్రిడ్జి ప్రొఫెసర్ రవిగుప్తా ప్రశ్నించారు. ఇండోనేసియా, మయన్మార్లో తీవ్రత తగ్గినా.. థాయ్లాండ్, శ్రీలంకలో వ్యాప్తి పెరుగుతోంది. కాగా, ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు ‘‘సూపర్ స్ర్పెడర్’’ ఈవెంటుగా మారి పాకిస్థాన్లో ఆందోళన రేపుతున్నాయి. పాక్లో రోజుకు 5 వేల మందికి పాజిటివ్ వస్తోంది.