ఉపాధి పనులు పూటకే పరిమితం చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:46:25+05:30 IST

ఉపాధి పనులు పూటకే పరిమితం చేయాలి

ఉపాధి పనులు పూటకే పరిమితం చేయాలి
పెద అవుటపల్లిలో కార్యదర్శికి వినతిపత్రం అందిస్తున్న ఉపాధిహామీ కూలీలు

ఉంగుటూరు, జూన్‌ 27 : ఉపాధిహామీ పథకం పనులు రెండుపూటలా కాకుం డా ఒకపూటకే పరిమితం చేయాలని కోరుతూ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కూలీలు సోమవారం పెదఅవుటపల్లిలో నిర్వహించిన స్పందనలో పంచాయతీ కార్యదర్శి ఎం.సరోజినికి వినతిపత్రం అందజేశారు. రెండుపూటలా పని విధానం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా మండుటెండల్లో పనిచేయడంవల్ల తీవ్ర అస్వస్ధతకు గురౌతున్నామని పేర్కొన్నారు. పనులవద్ద టెంట్లు, తాగునీరు. ప్రథమ చికిత్స బాక్సులు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడంలేదని, పలుగు, పార వంటి పనిముట్లతోపాటు, ఇన్సెంటివ్స్‌, వేసవి అలవెన్సులు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వెలిబుచ్చారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ఆవేదనను ప్రభుత్వానికి నివేదించి, ఒకపూట పని చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. 

పెదఅవుటపల్లిలో అఽధ్వానంగా తయారైన నాలుగు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలంటూ సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం పంచాయతీ సర్పంచ్‌ బాణావతు తిరుపతమ్మ, కార్యదర్శి ఎం.సరోజినికి వినతి పత్రం సమర్పించారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఒకమోస్తరు వర్షం కురిసినా ఆయా రోడ్లపై నడవలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. కనీసం రబ్బీష్‌ తోనైనా రోడ్లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తిచేశారు.  సీపీం మండల నాయకులు అజ్మీర్‌ వెంకటేశ్వరరావు,  పార్టీ గ్రామ నాయకులు కె.సీతారామరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T06:46:25+05:30 IST