పనులు చేసి పస్తులు

ABN , First Publish Date - 2022-06-30T05:30:00+05:30 IST

సకాలంలో వేతనాలు అందక ఉపాధిహామీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు సైతం ఉపాధిహామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా ఒకటి, రెండు వారాల్లో కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాలి. కానీ, ఏడు వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పనులకు వెళ్లినా.. పస్తులుండక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులు చేసి పస్తులు
ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

ఏడు వారాలుగా అందని ఉపాధి బిల్లులు
జిల్లాలో రూ.15.20 కోట్ల బకాయిలు
వేతనాల కోసం ఎదురుచూస్తున్న కూలీలు
(ఇచ్ఛాపురం రూరల్‌)

 సకాలంలో వేతనాలు అందక ఉపాధిహామీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు సైతం ఉపాధిహామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా ఒకటి, రెండు వారాల్లో కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాలి. కానీ, ఏడు వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పనులకు వెళ్లినా.. పస్తులుండక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 5,05,885 జాబ్‌ కార్డులలో 10,02,890 మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 2,35,294 మంది పనులు చేస్తున్నారు. వీరికి సంబంధించి మే 15వ తేదీ నుంచి వేతనాలు అందలేదు. మొత్తం రూ.15.20 కోట్లు బకాయి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కూలీల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతీ వారం మండల కార్యాలయానికి పంపుతారు. వారు చేసిన పనిని బట్టి ప్రతి సోమవారం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజులకు కూలీల ఖాతాల్లో నగదు జమవుతుంది. వివరాలు నమోదు చేసి నెలన్నర రోజులు కావస్తున్నా.. వేతనాలు చెల్లించడం లేదు. ఈ ఏడాది వేసవిలో అదనపు భత్యం కూడా ఇవ్వలేదు. దీంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయమై డ్వామా పీడీ ఎం.రోజారాణి వద్ద ప్రస్తావించగా.. బిల్లులు ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే ఉపాధిహామీ కూలీలకు వేతనాలు మంజూరవుతాయని తెలిపారు.

 
 

Updated Date - 2022-06-30T05:30:00+05:30 IST