యూపీఏనా.. అదెక్కడుంది?
ABN , First Publish Date - 2021-12-02T07:03:42+05:30 IST
దేశంలో యూపీఏ లేనే లేదని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ...
2024 ఎన్నికల్లో కొత్త విపక్ష కూటమి!
ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బీజేపీని ఓడించడం తేలికే!
యూపీ ఎన్నికల్లో పోటీచేయం: మమతా బెనర్జీ
ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ
ముంబై, డిసెంబరు 1: దేశంలో యూపీఏ లేనే లేదని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమె.. జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ స్థానాన్ని టీఎంసీ భర్తీ చేయాలన్న సంకల్పంతో ఇప్పటికే గోవా, మేఘాలయల్లో ఆ పార్టీ కీలక నేతలను తన వైపు తిప్పుకొన్నారు. మరిన్ని రాష్ట్రాలపైనా కన్నేశారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ముంబై వచ్చిన ఆమె.. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సమావేశమయ్యారు. అనంతరం ఉభయులూ మీడియాతో మాట్లాడారు. యూపీఏకి సారథిగా ఉన్న కాంగ్రె్సనే టార్గెట్ చేశారు. ‘యూపీఏనా.. అంటే ఏం టి? యూపీఏ అనేదే లేదు’ అని మమత అన్నారు. తమ భేటీ 2024 ఎన్నికలకు సన్నాహకంగా పవార్ అభివర్ణించారు. అన్ని ప్రాంతీయ పార్టీలూ కలిస్తే బీజేపీని ఓడించడం తేలికేనని మమత స్పష్టంచేశా రు. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీచేయదన్నారు. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తా రా అని అడుగగా.. తాను చిన్న కార్యకర్తనేనని.. అలా గే కొనసాగుతానని బదులిచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించడం అవసరం. ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే లాభం లేదు’ అని ఎద్దేవాచేశారు. ఆమె మంగళవారం శివసేన నేతలు సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేలతోనూ సమావేశమయ్యారు. సీఎం, శివసేనాధిపతి ఉద్ధవ్ శస్త్రచికిత్స చేయించుకుని ఉండడంతో కలవడానికి వీలు కాలేదు.