ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా ambulance service

ABN , First Publish Date - 2021-11-15T14:22:17+05:30 IST

దేశంలోనే మొట్టమొదటిసారి యూపీలో ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు....

ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా ambulance service

దేశంలోనే మొట్టమొదటిసారి యూపీలో ప్రారంభం

 లక్నో: దేశంలోనే మొట్టమొదటిసారి యూపీలో ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆవుల కోసం అంబులెన్స్ సేవను ప్రారంభించనున్నట్లు యూపీ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి తెలిపారు.‘‘112 ఎమర్జెన్సీ సర్వీస్ నంబరుతో సమానంగా ఈ కొత్త అంబులెన్స్ సేవలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఆవులకు చికిత్స చేయడానికి మార్గం సుగమం చేస్తుంది’’ అని చౌదరి మధురలో విలేకరులతో చెప్పారు. ఈ పథకం కింద 515 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, దేశంలోనే ఆవుల చికిత్స కోసం అంబులెన్స్ లను ప్రవేశపెట్టడం మొదటిసారి అని మంత్రి పేర్కొన్నారు. 


అనారోగ్యం బారిన పడిన ఆవుల చికిత్స కోసం ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోనే వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ వస్తుందని మంత్రి తెలిపారు.డిసెంబరు నాటికి ఈ పథకం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం లక్నోలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఉచితంగా నాణ్యమైన వీర్యం అందిండంతో యూపీ రాష్ట్రంలో ఆవుల జాతి అభివృద్ధి కార్యక్రమం మరింత ఊపందుకుంటుందని చౌదరి చెప్పారు. మథుర సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆవుల అంబులెన్స్ ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి చౌదరి వివరించారు.


Updated Date - 2021-11-15T14:22:17+05:30 IST