UP, Punjab Election : మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ABN , First Publish Date - 2022-02-20T13:30:26+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

UP, Punjab Election : మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ విడతలో 16 జిల్లాల పరిధిలో 59 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 627 మంది అభ్యర్థులు ఈ విడతలో బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలోనే ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఉన్నారు. కర్హల్‌ స్థానం నుంచి అఖిలేష్‌ బరిలో ఉన్నారు. మరోవైపు జశ్వంత్‌ నగర్‌ నుంచి అఖిలేష్‌ బాబాయి శివపాల్‌ సింగ్‌ బరిలో ఉన్నారు.

 

ఇదిలా ఉంటే.. ఒకే విడతలో పంజాబ్‌లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నాయి. పంజాబ్‌లోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. మరికాసేపట్లో అనగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. బరిలో 93  మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు ఉన్నారు. చమ్‌ కౌర్‌ సాహిబ్‌, భదౌర్‌ స్థానాలు నుంచి సీఎం చన్నీ పోటీచేస్తున్నారు. ధురి నియోజకవర్గం నుంచి బరిలో ఆప్‌ నేత భగవంత్‌ మాస్‌, అమృత్‌సర్‌ తూర్పు నుంచి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పోటీలో ఉన్నారు. ఇక పటియాల అర్బన్‌ నుంచి మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, జలాలాబాద్‌ నుంచి అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ బాదల్‌ బరిలో ఉన్నారు. లంబీ స్థానం నుంచి మాజీ సీఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ బరిలో ఉన్నారు. 


కాగా.. పంజాబ్‌ ఎన్నికల్లో ఒంటరిగానే కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు బరిలో ఉన్నాయి. మరోవైపు శిరోమణి అకాలీదళ్‌-బీఎస్పీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో కూటమిగా బీజేపీ-పీఎల్‌సీ, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త పార్టీలు బరిలో ఉన్నాయి. పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌ కాంగ్రె‌స్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ ఛన్నీని రంగంలోకి దించిన రాహుల్‌ గాంధీ ప్రయోగం ఎంత మేరకు సఫలమవుతుందో ఈ ఎన్నికలు నిరూపించనున్నాయి.

Updated Date - 2022-02-20T13:30:26+05:30 IST