యూపీలో దారుణం..జర్నలిస్ట్ సజీవదహనం
ABN , First Publish Date - 2020-11-30T12:18:37+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పంటించి ఓ జర్నలిస్టును సజీవ దహనం చేసిన దారుణ ఘటన...
బలరాంపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పంటించి ఓ జర్నలిస్టును సజీవ దహనం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. బలరాంపూర్ పట్టణంలోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆగంతకులు ఇంటికి నిప్పంటించి జర్నలిస్టు రాకేష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడిని సజీవదహనం చేశారు.ఈ ఘటన జరిగినపుడు జర్నలిస్టు భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన వచ్చి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు. జర్నలిస్టును సజీవ దహనం ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయంపై దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు అధికారి చెప్పారు.