ఎనిమిదేళ్ల కొడుకు కిడ్నాప్.. అతి క్రూరంగా హత్య.. ఆ కిడ్నాప్ వెనుకున్న కారణం ఏంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-01-31T22:56:00+05:30 IST

అతను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో ప్రముఖ వైద్యుడు.. అతడి ఎనిమిదేళ్ల కొడుకు ఇటీవల కిడ్నాప్‌ అయ్యాడు..

ఎనిమిదేళ్ల కొడుకు కిడ్నాప్.. అతి క్రూరంగా హత్య.. ఆ కిడ్నాప్ వెనుకున్న కారణం ఏంటో తెలిస్తే షాక్!

అతను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో ప్రముఖ వైద్యుడు.. అతడి ఎనిమిదేళ్ల కొడుకు ఇటీవల కిడ్నాప్‌ అయ్యాడు.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు.. కేసు దర్యాఫ్తు చేసిన పోలీసులు రెండ్రోజుల అనంతరం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.. వారు గతంలో ఆ వైద్యుడి వద్దే కాంపౌండర్లుగా పనిచేసేవారు.. వారు తమ కొడుకును ఎందుకు చంపేశారో తెలుసుకుని ఆ వైద్యుడు నిర్ఘాంతపోయాడు. 


తన కొడుకు కనిపించడం లేదంటూ బులంద్‌షెహర్‌ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం స్థానిక వైద్యుడు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. రెండ్రోజుల అనంతరం ఆదివారం ఉదయం నిజాం, షాహిద్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. తామే ఆ బాలుడిని చంపేసినట్టు ఆ ఇద్దరూ పోలీసుల ఎదుట అంగీకరించారు. 


రెండేళ్ల క్రితం వరకు ఆ ఇద్దరూ ఆ వైద్యుడి వద్దే కాంపౌండర్లుగా పనిచేసేవారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో సదరు వైద్యుడు వారిని ఉద్యోగాల నుంచి తొలగించాడు. అప్పట్నుంచి ఆ వైద్యుడిపై వారు పగ పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ వైద్యుడి ఎనిమిదేళ్ల కొడుకుని కిడ్నాప్ చేశారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి అదే రోజు సాయంత్రం ఆ బాలుడిని చంపేశారు. మాజీ ఉద్యోగులు, పైగా డాక్టర్ ఇంటి పరిసరాల్లోనే నివసిస్తున్నారనే కారణంతో వారిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-01-31T22:56:00+05:30 IST