లంచాలు తీసుకోవడాన్ని సమర్ధించుకున్న పోలీసు అధికారి

ABN , First Publish Date - 2021-12-20T23:16:52+05:30 IST

పోలీసు విభాగం కంటే ఉత్తమమైన విభాగం మరొకటి లేదు. పోలీసులు కనుక డబ్బులు తీసుకున్నట్లైతే ఇక పని అయిపోయినట్టే. అదే వేరే విభాగం తీసుకుంటే, డబ్బులు తీసుకున్నప్పటికీ పని అవ్వదు..

లంచాలు తీసుకోవడాన్ని సమర్ధించుకున్న పోలీసు అధికారి

లఖ్‌నవూ: ప్రభుత్వ అధికారుల పని అంటే లంచం లేనిదే పని కాదనేది అందరికీ తెలిసిందే. ఏ విభాగం దీనికి మినహాయింపు కాదు. దేశంలో లంచం లేని ప్రభుత్వ రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. అయితే లంచం గురించి మాట్లాడినప్పుడు కరుడుగట్టిన లంచగొండిలు సైతం ‘తూచ్’ అంటూ తప్పించుకుంటుంటారు. కానీ ఓ పోలీసు అధికారి లంచం తీసుకోవడాన్ని చాలా చక్కగా సమర్ధించుకున్నారు. లంచం తీసుకోవడం సరైందే అని నేరుగా చెప్పలేదు కానీ.. లంచం తీసుకున్నప్పటికీ తాము పని చేస్తామని లంచం తీసుకోవడాన్ని సమర్ధించుకున్నారు. అంతేనా.. లంచం తీసుకుని తాము మాత్రమే పని చేస్తామని, మిగతా అన్ని విభాగాల కంటే పోలీసు విభాగమే ఈ విషయంలో ఉత్తమమైందని కితాబు ఇచ్చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా స్థానిక పోలీసు అధికారి పలికిన మాటలివి.


దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నావ్‌లోని ఒక పోలీసు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో భాగంగా సదరు పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘పోలీసు విభాగం కంటే ఉత్తమమైన విభాగం మరొకటి లేదు. పోలీసులు కనుక డబ్బులు తీసుకున్నట్లైతే ఇక పని అయిపోయినట్టే. అదే వేరే విభాగం తీసుకుంటే, డబ్బులు తీసుకున్నప్పటికీ పని అవ్వదు. టీచర్లను చూడండి. వాళ్లు ఇంటి దగ్గర ఉండి క్లాసులు చెప్పుకుంటున్నారు. కానీ మనం కొరొన వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడ ఉండి ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.


ఈ వీడియోను యూపీకి చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే దీనిపై ఉన్నావ్ పోలీసులు స్పందించారు. ‘‘బీజాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ దీనిపై విచారణకు ఆదేశించింది. దర్యాప్తు రిపోర్ట్ తొందరలోనే వస్తుంది’’ అని ఉన్నావ్ పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-20T23:16:52+05:30 IST