UP Congress : ఎన్నికల తర్వాత మమ్మల్ని ప్రియాంక పట్టించుకోవడం లేదు : యూపీ కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2022-08-10T21:52:00+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఆజాదీ

UP Congress : ఎన్నికల తర్వాత మమ్మల్ని ప్రియాంక పట్టించుకోవడం లేదు : యూపీ కాంగ్రెస్ నేతలు

లక్నో : స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఆజాదీ కీ గౌరవ్ యాత్ర (Azadi ki Gaurav Yatra)ను మంగళవారం ప్రారంభించింది. ఎన్నికల్లో వరుస పరాజయాల ప్రభావం ఆ పార్టీపై ఎంత తీవ్రంగా ఉందో ఈ యాత్రకు లభించిన స్పందననుబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ పార్టీ కార్యకర్తల ఆందోళనకు మరో కారణం ఏమిటంటే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) వ్యవహార శైలి. 


మంగళవారం నిర్వహించిన యాత్రలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ, మొహరం కారణంగా తమ యాత్రలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనలేదని చెప్పారు. తమ యాత్ర ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని, అప్పటికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని చెప్పారు. శాసన సభ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ వాద్రా తమకు నాయకత్వం వహించేవారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ విభాగాన్ని వదిలిపెట్టేశారనిపిస్తోందని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రతి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనేవారని, అది పెద్ద కార్యక్రమమైనా, చిన్న కార్యక్రమమైనా హాజరయ్యేవారని తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కృషి చేసేవారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె కనిపించడం లేదన్నారు. 


ఇదిలావుండగా, ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ వాదనను ఏఐసీసీ కార్యదర్శులు కానీ, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ కానీ  వినిపిస్తున్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. యూపీపీసీసీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ గత మార్చిలో రాజీనామా చేసిన తర్వాత మరొకరిని ఆ పదవిలో నియమించలేదు. 


Updated Date - 2022-08-10T21:52:00+05:30 IST