అందరి సంక్షేమం కోసం కృషి చేసేది మేమే : యూపీ బీజేపీ చీఫ్

ABN , First Publish Date - 2021-09-15T21:33:44+05:30 IST

కుల, మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం కృషి చేసేది

అందరి సంక్షేమం కోసం కృషి చేసేది మేమే : యూపీ బీజేపీ చీఫ్

లక్నో : కుల, మతాలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం కృషి చేసేది తమ పార్టీ మాత్రమేనని ఉత్తర ప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో తమకు ఇతర పార్టీలేవీ గట్టి పోటీ ఇవ్వలేవన్నారు. ఓ న్యూస్ ఛానల్ బుధవారం  నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


రాబోయే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కుల, మత, వంశ ప్రమేయం లేని రాజకీయాలు చేసే పార్టీ, యువత సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ మాత్రమే బీజేపీ ముందు నిలబడగలుగుతుందని చెప్పారు. బీజేపీతో పోటీపడే సత్తా ఇతర పార్టీలకు లేదన్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ముస్లింలను మచ్చిక చేసుకోవడం కోసం ఆ పార్టీ వెంపర్లాడుతుందన్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీని బలహీన పార్టీగా భావించకూడదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కన్నా బలమైన పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోతోందన్నారు. 


రాబోయే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 400 స్థానాలు లభిస్తాయని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేయడంపై స్వతంత్ర దేవ్ సింగ్ స్పందిస్తూ, అన్ని స్థానాలు ఎక్కడి నుంచి పొందుతారని ప్రశ్నించారు. 


అయోధ్యలో రామాలయం నిర్మాణం, అధికరణ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి అమలు మతపరమైనవా? అని అడిగారు. రామాలయం నిర్మాణం ప్రారంభమైన తర్వాత అల్లర్ల సంఘటనలు జరగలేదన్నారు. 


రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటి కన్నా ఎక్కువ స్థానాలు లభిస్తాయని చెప్పారు. 2017 శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 325 స్థానాలు లభించాయి. మొత్తం శాసన  స్థానాలు 436. 


Updated Date - 2021-09-15T21:33:44+05:30 IST