నిరుపయోగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2022-05-18T05:23:23+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించినా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

నిరుపయోగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
రాయపోల్‌ మండలం లింగారెడ్డిపల్లి వద్ద లబ్ధిదారులకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

కేటాయింపులు జరిగినా మౌలిక సదుపాయాలు లేక తాళాలు

రాయపోల్‌, మే 17: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించినా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రాయపోల్‌ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో పేదల కోసం ప్రభుత్వం 25 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం గజ్వేల్‌-రామాయంపేట రహదారి పక్కన స్థలం ఎంపిక చేశారు. రహదారి పక్కన అన్ని హంగులతో కాలనీ ఏర్పాటు అవుతుందని పేదలు మురిసిపోయారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధిత కాంట్రాక్టర్‌ ఇళ్ల నిర్మాణాన్ని నత్తనడకన సాగించి, చివరకు పూర్తయ్యాయనిపించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన నల్లాలు, స్విచ్‌బోర్డులు, హోల్డర్లు లాంటివి ఇంకా బిగించలేదు. అంతేకాకుండా మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదు. విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదు. అయినా ఆరునెలల క్రితమే రెవెన్యూ అధికారులు లింగారెడ్డిపల్లికి చెందిన అర్హులైన లబ్ధిదారులను ఎంపికచేసి ఇళ్లను కేటాయించారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయలేకపోయారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లకు తాళాలు వేసి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-18T05:23:23+05:30 IST