పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు
ABN , First Publish Date - 2021-10-19T04:21:47+05:30 IST
నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
తరగతి గదిలో ఖాళీ మద్యం బాటిల్స్, సిగరెట్లు, గ్లాసులు
ఫర్నిచర్, స్విచ్ బోర్డులను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
నారాయణరావుపేట, అక్టోబరు 18 : నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాఠశాల మొదటి అంతస్తులోని తరగతి గదుల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ను, విద్యుత్ స్విచ్ బోర్డులను, కుర్చీలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల మొదటి అంతస్తు భవనంలోకి నిచ్చెన ద్వారా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదిలో మద్యం సేవించి, తినుబండారాలు పడేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకయ్య తెలిపారు. మరో తరగతి గదిలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఓ వస్తువు దొరకడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ ఎస్ఐ శంకర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి, ఫర్నిచర్ను ధ్వంసం చేసిన దుండగులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలకు రాత్రివేళల్లో కాపలాదారులు, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.