రక్షణ లేని గంగ
ABN , First Publish Date - 2022-09-26T05:23:29+05:30 IST
తెలుగుగంగ ప్రధాన కాలువకు రక్షణ లేకుండాపోయింది. గత కొద్ది కాలంగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రధాన కాలువ శిథిలమైపోయింది.
- అర కిలోమీటర్ మేర ప్రధాన కాలువకు లీకేజీలు
- నిర్లక్ష్యంలో తెలుగు గంగ అధికారులు
రుద్రవరం, సెప్టెంబరు 25: తెలుగుగంగ ప్రధాన కాలువకు రక్షణ లేకుండాపోయింది. గత కొద్ది కాలంగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రధాన కాలువ శిథిలమైపోయింది. రుద్రవరం సమీపంలో 50 మీటర్ల మేర రక్షణ గోడ కూలిపోయింది. కాలువ గట్టు 61/600 కి.మీ సమీపంలో అర కిలోమీటరు ప్రధాన కాలువ గట్టు వెంట లీకేజీలు పడ్డాయి. అయినా గంగ అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కాలువ లేకేజీ అయ్యే స్థితికి చేరుకుందని ప్రజలు అంటున్నారు. అలాగే రక్షణ గోడ కూలిపోవడంతో గట్టు వెంట రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని అంటున్నారు. రక్షణ గోడ పడిపోయిన చోట కనీసం కర్రలు కూడా అడ్డం పెట్టలేదని ప్రజలు అంటున్నారు.
ప్రమాదకరంగా ఉంది: దస్తగిరి, రైతు, రుద్రవరం
తెలుగుగంగ ప్రధాన కాలువ గట్టు ప్రమాదకరంగా ఉంది. గట్టుకు మరమ్మతులు చేయించాలి. లేకుంటే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి నివేదికలు పంపించాం: శివశంకర్రెడ్డి, తెలుగుగంగ ఈఈ, ఆళ్లగడ్డ
గంగ రక్షణ గోడ కూలిపోయిందని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. రాతిగోడకు సిమెంట్ పోవడంతో నీరు లీకవుతోంది. కాలువను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లాం.