ఎప్పుడిస్తారో!

ABN , First Publish Date - 2022-08-04T05:17:41+05:30 IST

ఇంతవరకూ విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించి కుట్టు కూలి చెల్లించకపోవడంతో తల్లిదండ్రులకు చేతిచమురు వదులుతోంది.

ఎప్పుడిస్తారో!

విద్యార్థుల యూనిఫారాలకు చెల్లించని కుట్టు కూలి

గతేడాది డబ్బులు నేటికీ జమకాని వైనం

ఈ ఏడాదివి ఇంకెప్పటికో..

తల్లిదండ్రులకు అదనపు ఖర్చు

పార్వతీపురం రూరల్‌ :  ‘పేద విద్యార్థుల కోసమే జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నాం..  మెరుగైన విద్య అందించేందుకు కోట్లాది రుపాయలు వెచ్చిస్తున్నాం’. అని గొప్పలు చెబుతున్న సర్కారు ప్రకటనలకే పరిమితమవుతోంది. ఇంతవరకూ విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించి కుట్టు కూలి చెల్లించకపోవడంతో తల్లిదండ్రులకు చేతిచమురు వదులుతోంది. వాస్తవంగా ప్రభుత్వం ఏటా మూడు జతల యూనిఫారాలు అందిస్తుంది. గతంలో కుట్టించిన యూనిఫారాలను పంపిణీ చేసేవారు. అయితే కొలతల్లో తేడాలు వస్తుండడంతో క్లాత్‌నే నేరుగా అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు యూనిఫారాలకు సంబంధించి కుట్టు కూలీని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జతకు రూ. 40 చొప్పున మూడు జతలకు రూ. 120 జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అరొకర కూలి డబ్బులు కూడా సర్కారు సకాలంలో జమ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వాస్తవంగా  1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు జత యూనిఫారం కుట్టించేందుకు రూ. 300 నుంచి రూ. 400, అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 500 వరకు టైలర్లు కుట్టు కూలి తీసుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులకు అదనపు ఖర్చు తప్పడం లేదు.  ఉమ్మడి జిల్లాలో గతేడాది 2,26,150 మంది విద్యార్థులకు కుట్టి కూలి అందించాల్సి ఉంది. ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున యూనిఫారాలను అందించారు. ఒకటి నుంచి 8వ తరగతి  విద్యార్థులకు ఒక్కో జతకు రూ. 40 చొప్పున రూ. 120 అందించాల్సి ఉంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కో జతకు రూ. 80 చొప్పున మూడు జతలకు రూ. 240 చెల్లించాల్సి ఉంది.  కాగా ఈ ఏడాది 2,25,252 మంది విద్యార్థులకు కుట్టి కూలి అందించాల్సి ఉంది. గతేడాదికి సంబంధించి కుట్టు కూలిలను ఇప్పటివరకు తల్లుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. ఈ ఏడాదికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

జమ కావల్సి ఉంది

గతేడాది యూనిఫారాల కుట్టి కూలికి సంబంధించి బడ్జెట్‌ విడుదలైంది.  విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ త్వరలోనే జరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి ప్రతిపాదనలను తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నాం.

 - ఎం.శ్రీనివాసరావు, చీఫ్‌ మానటరింగ్‌ ఆఫీసర్‌, జిల్లా సర్వశిక్షా అభియాన్‌

 

Updated Date - 2022-08-04T05:17:41+05:30 IST