అనుమతులు లేని మిరపవిత్తనాలు పట్టివేత

ABN , First Publish Date - 2020-02-20T10:39:17+05:30 IST

మిరప విత్తనాల తయారీ యూనిట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మిరప విత్తనాల సంచులను బుధవారం ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌

అనుమతులు లేని మిరపవిత్తనాలు పట్టివేత

ఖమ్మంక్రైం, ఫిబ్రవరి 19 : మిరప విత్తనాల తయారీ యూనిట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మిరప విత్తనాల సంచులను బుధవారం ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం గుదిమళ్ల చెరువు సమీపంలోని సదరు యూనిట్‌లో అక్రమంగా మిరపవిత్తనాల సంచులు నిల్వచేశారంటూ వచ్చిన సమాచారంతో ఖమ్మం ఏసీపీ గంటా వెంకట్రావు తన సిబ్బందితో వ్యవసాయ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు.


ఈక్రమంలో సమారు 25 బస్తాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మిరపవిత్తనాలను నిల్వఉంచినట్టు గుర్తించారు. వీటి విలువ రూ.48లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ సదరు విత్తనాలను సీజ్‌చేసి ఖమ్మం రూరల్‌ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ విత్తనాలు నకిలీవా.?. సరైనవా? అనేది తేలాల్సి ఉంది. ఇక ఈ విత్తనాల యూనిట్‌లో పనిచేస్తున్న చింతకాయల బాబును అదుపులోకి తీసుకున్నామని, యూనిట్‌ యజమాని పిట్టల వెంకటనర్సయ్య పరారీలో ఉన్నాడని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.  గతంలో నగరంలోని ప్రకా్‌షనగర్‌, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో నకిలీ కారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


తాజాగా గుదిమళ్లలో అనుమతిలేని మిరపవిత్తనాలు లభించటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం జరిగిన దాడుల్లో టాస్క్‌పోర్స్‌ సీఐ వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి, ఏడీఏ విజయచందర్‌, శ్రీనివాసరెడ్డి, సరిత, ఏవో నాగేశ్వరరావు, రామకృష్ణ, రూరల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T10:39:17+05:30 IST