‘విశ్వతోముఖత్వం’ – విపరీత ధోరణులు

ABN , First Publish Date - 2022-04-28T09:39:19+05:30 IST

సాహిత్యం ఎప్పుడూ సార్వజనీనమైన సత్యాన్నే ప్రతిపాదించాలి– ఇది శాస్త్రవేత్తలు, సాహిత్య ప్రముఖులు చెప్పే మాట. ఈ మధ్య ప్రశంసలు, విమర్శలలో...

‘విశ్వతోముఖత్వం’ – విపరీత ధోరణులు

సాహిత్యం ఎప్పుడూ సార్వజనీనమైన సత్యాన్నే ప్రతిపాదించాలి– ఇది శాస్త్రవేత్తలు, సాహిత్య ప్రముఖులు చెప్పే మాట. ఈ మధ్య ప్రశంసలు, విమర్శలలో కొంత విపరీత ధోరణులు చోటుచేసుకోవడం ఆశ్చర్యం కూడా. ‘పడమటి గాలి’ నాటకాన్ని ‘కన్యాశుల్కం’తో పోలుస్తూ ఈ మధ్య ‘విశ్వతోముఖత్వం’ అనే వ్యాసాన్ని జి. బలరామయ్య రాశారు. అభిమానం వేరు, దురభిమానం వేరు. బోయి భీమన్న ‘పాలేరు’ నాటకం, సుంకర వాసిరెడ్డి ‘మాభూమి’, పూసల ‘మండువా లోగిలి’ నాటకాలు గుర్తు రాలేదు వ్యాసకర్తకు. ఇదో విషాదం. ‘పడమటి గాలి’ మంచి నాటకమే... సందేహం లేదు. అయితే కొన్ని పాత్రలు, సంఘటనలు, కొన్ని వర్గాల ప్రజలకు అవమానకరంగా ఉన్నాయి. కారుమూరి సీతారామయ్య పరిశోధనా గ్రంథం ‘తెలుగు నాటకం–గ్రామీణ నేపథ్యం’లో పడమటి గాలి నాటకంలో లొసుగుల వివరాలు ఇచ్చారు. పైగా ఈ నాటకం శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనిషి’కి అనుసరణ అన్న వివాదం– రచయిత దృష్టికి ఎందుకు రాలేదో తెలియదు. కావాలని కొందరు– కొందర్ని మోయడం అనాదిగా వస్తున్న ఆచారం... దురాచారం అనాలేమో? నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే అధ‍ఃపాతాళానికి పారెయ్యడం విపరీత ధోరణులకు నిదర్శనం... ముఖ్యంగా సాహితీ రంగంలో! కులం–మతం–ప్రాంతం ఆధారంగా ఓ సాహిత్య ప్రక్రియను మోయడం అనాగరికం. అది తెలుగులో ఈ మధ్య ఎక్కువైంది. ఈ ధోరణిని అందరూ ఖండించాలి.

ఎన్. తారకరామారావు

Updated Date - 2022-04-28T09:39:19+05:30 IST