స్టీల్ప్లాంట్ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ABN , First Publish Date - 2021-05-18T05:08:38+05:30 IST
ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించేందుకు ప్రజల మద్దతుతో ఐక్య ఉద్యమాలు చేపట్టనున్నట్టు ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు.
ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, మే 17: ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించేందుకు ప్రజల మద్దతుతో ఐక్య ఉద్యమాలు చేపట్టనున్నట్టు ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 95వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షల్లో బీఎన్డబ్ల్యూ, ఆర్అండ్డీ, ఆర్ఎండీ, పీఈఎం, సీఈడీ విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండిగా విశాఖ స్టీల్ప్లాంట్ను అమ్మాలని చూస్తుంటే, పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నదని వివరించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ కె.సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, ఎల్వి.రమణయ్య, ఎస్.రమణ, ఎస్.హరి, శ్రీనివాసరావు, వెంకటరావు, రవి తదితరులు పాల్గొన్నారు.