సభ హుందాతనానికి విఘాతం తగదు : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-08-22T00:41:26+05:30 IST

పార్లమెంటు హుందాతనానికి విఘాతం కలిగించడం తగదని

సభ హుందాతనానికి విఘాతం తగదు : కేంద్ర మంత్రి

జైపూర్ : పార్లమెంటు హుందాతనానికి విఘాతం కలిగించడం తగదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సమస్యలపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే సభ గౌరవానికి విఘాతం కలిగించడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రసాభాసగా ముగిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


పెగాసస్ స్పైవేర్‌తో కొందరు ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సాగు చట్టాలపై కూడా చర్చ జరగాలని పట్టుబట్టాయి. 


హర్యానా, రాజస్థాన్‌లలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో జన ఆశీర్వాద్ యాత్ర ముగిసిన నేపథ్యంలో యాదవ్ మాట్లాడుతూ,  చర్చల ద్వారా, హుందాగా పార్లమెంటు కార్యకలాపాలు జరగాలన్నారు. సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వంపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, అయితే పార్లమెంటు హుందాతనాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. 


నిరసనలు, అంతరాయాలను అర్థం చేసుకోవచ్చునని, గందరగోళం సృష్టించడం సరికాదని అన్నారు. నూతన మంత్రులను సభకు పరిచయం చేయడానికి ప్రధాని మోదీకి అవకాశం లేకుండా చేశారన్నారు. ప్రతిపక్షాలు తాము కోరుకున్నపుడల్లా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యసభలో చర్చ జరుగుతుండగా, ప్రతిపక్షాలు అధ్యక్ష స్థానంపైకి రూల్ బుక్‌ను విసరడం దురదృష్టకరమన్నారు. 


జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా తాను 75 సమావేశాలు, ఏడు భారీ సభలను నిర్వహించానని చెప్పారు. రాజస్థాన్‌లో తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు. 


Updated Date - 2021-08-22T00:41:26+05:30 IST