ఛత్తీస్‌గఢ్ బొగ్గు క్షేత్రాల పరీశీలనకు కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-10-13T20:42:59+05:30 IST

బొగ్గు కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న

ఛత్తీస్‌గఢ్ బొగ్గు క్షేత్రాల పరీశీలనకు కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : బొగ్గు కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని బొగ్గు క్షేత్రాలను పరిశీలించబోతున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌ (ఎస్ఈసీఎల్) ను సందర్శించబోతున్నారని అధికారులు తెలిపారు. 


ఎస్ఈసీఎల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ నేరుగా బిలాస్‌పూర్‌లోని చకర్‌భాత విమానాశ్రయానికి బుధవారం మధ్యాహ్నం చేరుకుంటారు. బొగ్గు తవ్వకం, ఉత్పత్తి గురించి ఎస్ఈసీఎల్ ఉన్నతాధికారులతో చర్చిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కోర్బా బొగ్గు గనుల వద్దకు వెళ్ళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తారు. ఆయనతోపాటు కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ కూడా పాల్గొంటారు. 


ప్రహ్లాద్ జోషీ ఇటీవల మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, అక్టోబరులో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి అత్యధికంగా జరిగిందని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు. 


ఎస్ఈసీఎల్ ప్రజా సంబంధాల అధికారి శనీష్ చంద్ర మాట్లాడుతూ, సెప్టెంబరులో భారీ వర్షాలు కురవడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడిందన్నారు. తగినంత బొగ్గును సరఫరా చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో బొగ్గు ఉత్పత్తిని పెంచినట్లు తెలిపారు. 


అక్టోబరులో 14.73 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఎస్ఈసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 2.95 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 


Updated Date - 2021-10-13T20:42:59+05:30 IST