అధికారులు ‘ఎస్’ సర్ అనాల్సిందే
ABN , First Publish Date - 2022-08-11T09:00:03+05:30 IST
పేదల సంక్షేమానికి ఏ చట్టమూ అడ్డురాదని, అలాంటి చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించేందుకైనా వెనుకాడాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి
మంత్రులు చెప్పింది చేయాల్సిందే
పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: పేదల సంక్షేమానికి ఏ చట్టమూ అడ్డురాదని, అలాంటి చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించేందుకైనా వెనుకాడాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలే తారక మంత్రమని ఆయన పేర్కొన్నారు. నాగ్పుర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. మంత్రుల నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకు అనుగుణంగా నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
‘‘మీరు చెప్పే దాని ప్రకారం ప్రభుత్వం పని చేయదని నేను ఎప్పుడూ అధికారులకు చెబుతాను. మీరు ‘ఎస్ సర్’ అని మాత్రమే చెప్పాలి. మేము (మంత్రులు) చెప్పినట్టుగా వాటిని మీరు అమలు చేయాలి. మా నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం పని చేస్తుంది’’ ఆయన అన్నారు. 1995లో పోషకాహార లోపం కారణంగా గడ్చిరోలి, మెల్ఘాట్లో వేలాది మంది గిరిజన పిల్లలు మరణించారని, ఆ గ్రామాలకు రోడ్లు లేవని, రోడ్ల అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డుగా వచ్చాయని ఆయన ఉదహరించారు.