ఏడుగురు పాక్ ఉగ్రవాదులపై నిషేధం

ABN , First Publish Date - 2022-04-20T18:03:52+05:30 IST

ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో

ఏడుగురు పాక్ ఉగ్రవాదులపై నిషేధం

న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థానీ ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 


పాకిస్థాన్‌కు చెందిన సజ్జాద్ గుల్, అషిక్ అహ్మద్ నెంగ్రూ, ముష్తాక్ అహ్మద్ జర్గార్ (లట్రమ్), అర్జుమండ్ గుల్జార్ జాన్ (హంజా బుర్హాన్), అలీ కషిఫ్ జన్, మొహియుద్దీన్ ఔరంగజేబ్ అలంగిర్, హఫీజ్ టల్హా సయీద్‌లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం మొత్తం మీద 38 మంది పాకిస్థానీ ఉగ్రవాదులపై నిషేధం విధించింది. 


ఐక్యరాజ్య సమితికి, ఇతర దేశాలకు ఈ ఉగ్రవాదుల గురించి సమాచారం అందజేయడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు కశ్మీరు లోయలో ఉంటూ ఈ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు, అటువంటి వారికి గట్టి హెచ్చరికను పంపడానికి కూడా ఈ చర్యలు దోహదపడతాయి. పాకిస్థానీ జీహాదీ గ్రూపులకు సహకరిస్తున్న కశ్మీరు లోయలోని వ్యక్తులను నిశితంగా గమనించేందుకు వీలవుతుంది. ఈ ఉగ్రవాదులు, వారి సహచరులు సంపాదించిన ఆస్తులు ఉగ్రవాద నేరాలకు సంబంధించినవని నిర్థరణ అయితే, వాటిని జప్తు చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. 


కశ్మీరులో ఉగ్రవాదాన్ని, భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలను పాకిస్థాన్ ఇప్పటికీ ప్రోత్సహిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)కు తెలియజేయడానికి కూడా ఈ డేటా బ్యాంకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి కొంత వరకు ఇది కూడా ఒక కారణం. 


Updated Date - 2022-04-20T18:03:52+05:30 IST