Police Medal for Gallantry: జమ్మూ-కశ్మీరుకు పోలీసు శౌర్య పతకాల పంట

ABN , First Publish Date - 2022-08-14T19:50:02+05:30 IST

భారత దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవాల (Independence Day) సందర్భంగా

Police Medal for Gallantry: జమ్మూ-కశ్మీరుకు పోలీసు శౌర్య పతకాల పంట

న్యూఢిల్లీ : భారత దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవాల (Independence Day) సందర్భంగా పోలీసులకు శౌర్య పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డీజీపీ దిల్‌బాగ్ సింగ్ నేతృత్వంలోని జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) పోలీసులకు అత్యధిక పతకాలు లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (Maharashtra), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పోలీసులు ఉన్నారు. 


ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 347 పోలీసు శౌర్య పతకాలను (Police Medal for Gallantry) ప్రకటించగా, వీటిలో 108 పతకాలు జమ్మూ-కశ్మీరు పోలీసులకు లభించాయి. డీజీ కుల్‌దీప్ సింగ్ నేతృత్వంలోని సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బందికి 109 పతకాలు లభించాయి. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ఇతర భద్రతా దళాల్లో అత్యధిక పతకాలు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి లభించాయి. బీఎస్ఎఫ్‌ సిబ్బందికి 19 పతకాలు, మహారాష్ట్ర పోలీసులకు 42, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు 15 పతకాలు లభించాయి. 


ఉగ్రవాద, వామపక్ష తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో జమ్మూ-కశ్మీరు పోలీసులు, సీఆర్‌పీఎఫ్ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జమ్మూ-కశ్మీరులో శౌర్యపరాక్రమాలతో పని చేసినందుకు 204 మంది ఈ పతకాలను స్వీకరించబోతున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన 80 మందికి, ఈశాన్య రాష్ట్రాల్లో పని చేసిన 14 మందికి ఈ పతకాలు లభించాయి. 


విశిష్ట సేవలు అందించిన 87 మందికి రాష్ట్రపతి పోలీస్ పతకాలు, మెరిటోరియస్ సర్వీస్‌కు గుర్తింపుగా 648 మందికి పోలీస్ పతకాలు లభించాయి. ఈ వివరాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


Updated Date - 2022-08-14T19:50:02+05:30 IST